వరివెన్ను దశలో సుడిదోమ ప్రభావం అధికం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానాకాలంలో పండిస్తున్న వరి పంట ప్రస్తుతం అంకురం దశ నుంచి చిరుపొట్ట దశలో ఉంది. ఈ దశలో ఉన్న వరి పంటకు సుడిదోమ ఎక్కువగా వచ్చే అస్కారం ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల క్షేత్ర ప్రదర్శనల ద్వారా ఇప్పటికే కొన్ని చోట్ల రైతు పొలాల్లో సుడిదోమ ఉనికిని గుర్తించారు. ఈ దశలో రైతును అప్రమత్తం చేస్తే దీని ద్వారా వచ్చే పంటనష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా సుడిదోమ సెఫ్టంబర్ నుంచి నవంబర్ వరకు ఎక్కువగా ఆశిస్తుంది.
సుడిదోమ ఆశించడానికి ముఖ్యకారణాలు:
1, ఆగస్టు మాసంలో అధిక వర్షాలు కురవడంతో పొలాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం
2, ప్రతి 2 మీటర్ల పొడవుకు 20 సెంటిమీటర్ల చొప్పున కాలి బాటలు తీయకపోవడం
3, నత్రజని ఎరువు మోతాదుకు మించి వాడటం
4, పగటి ఉష్ణోగ్రతలు 26`30 డిగ్రీలు మరియు రాత్రి ఉష్ణోగ్రతు 19`20 డిగ్రీల మధ్య ఉన్నప్పడు.
5, పైరు తొలి దశలో ఆకుమడత, తాటాకు తెగులు, వరి ఈగలాంటి పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్, ఫ్రొఫెనోఫాస్, అలాగే సింధటిక్ 6,పైరిథ్రాయిడ్ మందును అధికమోతాదులో పిచికారి చేయడం వల్ల సుడిదోమ ఎక్కువగా ఆశించే ప్రమాదముంది.
సుడిదోమ రకాలు:
సుడిదోమ రెండు రంగుల్లో ఉంటుంది. వీటిని గోధుమరంగుదోమ, తెల్ల వీపు సుడిదోమ అని పిలుస్తారు.
నష్టపరిచే విధాన:
పిల్ల, మరియు తల్లి పురుగులు నీటి పై భాగంలో దుబ్బు,మొదళ్ళ దగ్గర ఉండి. రసం పీల్చుతాయి. దీనివల్ల పైరు లేత పసుపు వర్ణానికి మారుతుంది. వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో నీటిని గమనిస్తే తెట్టులాగా తెలియడుతూ కనపడతాయి. దీని మూలంగా పైరు సుడులు,సుడులుగా వలయాకారంలో ఎండిపోవడం జరుగుతుంది. దీనినే హపర్బర్న్ అని అంటారు. ఉధృతి ఎక్కువైనప్పుడు చేను ఎండిపోయి, తాలు గింజు ఏర్పడటం లేదా గింజ నూర్చినప్పడు గింజ ఎక్కువగా నూకగా మారడం జరుగుతుంది.
సస్యరక్షణ:
1, పొలంలో నీటిని నిలకట్టకుండా పొలాన్ని అడపాదడపా ఆరబెడుతూ ఉండాలి
2) నత్రజని ఎరువును మోతాదుకు మించకుండా ,ఎక్కువ దఫాలుగా పొలంలో వేసుకోవాలి.
3, పురుగుఉదృతిని గమనించి పురుగుమందును పిచికారి చేయాలి ఈనిక దశలో దుబ్బుకు 20- 25 పురుగులను గమనించినప్పుడు మాత్రమే పిచికారి చేయాలి.
4, ఈ దశలో ఎసిఫేట్ 75 ఎస్పి 300 గ్రా లేదా బ్యూఫ్రోఫెజిన్ 320 మిలీ లేదా ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్ కలిపి ఉన్న మిశ్రమ మందు 300 గ్రా ఎకరానికి చొప్పన పిచికారి చేయాలి.
పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పడు థైనో టెఫ్యూరాన్ 80 గ్రా ,లేదా ఇధోఫెన్ప్రాక్స్ 400 మిలీ లేదా పై మిట్రోజన్ 120 గ్రా ఎకరానికి చొప్పున కులుపుకుని పిచికారి చేయాలి.
ముఖ్యగమనిక:
పురుగు మందు పిచికారి చేసేటప్పుడు మందు ద్రావణం మొక్క మొదళ్ళ మీద పడేలా చేస్తే ఫలితం బాగుంటుంది.
డా. వి.లక్ష్మినారాయణమ్మ,డా జి. వీరన్న, డా. విశ్వ తేజ, డా.శివ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు భద్రాద్రి కొత్తగూడెం